కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టపగలే దట్టమైన చీకట్లు కమ్ముకున్నాయి. చూస్తుండగానే ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కుండపోత వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల బీభత్సానికి తోడు అరగంట పాటు నాన్స్టాప్గా కురిసిన వర్షం నల్లగొండను అతలాకుతలం చేసింది. దట్టమైన వర్షపు తెరల కారణంగా కనుచూపు మేరలో ఉన్న కొండలు, ఎత్తైన భవనాలు కూడా పూర్తిగా కనిపించకుండా పోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ నీళ్ళమయంగా మారాయి. ఈదురుగాలులు, మెరుపుల ధాటికి భయాందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించలేదు. దీంతో వ్యాపార సముదాయాలు మూతపడి, రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. హఠాత్తుగా సంభవించిన ఈ వర్షపు బీభత్సంతో నల్లగొండలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

