కలం, వెబ్ డెస్క్ : రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్టీల పేరుతో అమాయకులను నమ్మించి అందినకాడికి దోచుకున్న ఓ మహిళా ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 6.5 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన బద్దం జ్యోతి రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హయత్ నగర్ (Hayathnagar)కు చెందిన జ్యోతి రెడ్డి (Jyothi Reddy) గత తొమ్మిదేళ్లుగా కమలా నగర్లో నివసిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతోంది. తొలినాళ్లలో పరిచయస్తులతో చిట్టీలు నిర్వహించి, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు లాభాలు పంచడంతో అందరూ ఆమెను నమ్మారు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఆమె 2020 నుండి సుమారు 20 మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైంది.
నిందితురాలు ఇంకా చాలా మందిని ఇదే పద్ధతిలో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు చిట్ ఫండ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అధిక లాభాల ఆశ చూపే ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

