కలం, వెబ్డెస్క్: గురుకులాల టెండర్లపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముందుగా గురుకులాల్లో అవినీతిపై మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ (Harish Rao) రావు తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే అప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అజారుద్దీన్ గన్ పార్క్ వద్దకు వెళ్లారని తెలిసి అక్కడికే వెళ్తామన్నారు. మంత్రులు చర్చకు పిలిచారు. మేం వెళ్తాం అంటూ హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్కు బయలుదేరారు. ఆయన వెంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. గురుకులాల టెండర్లలో అవినీతి నిరూపించేందుకు ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నామని హరీశ్ రావు టీం ప్రకటించింది. అన్ని ఆధారాలతో చెప్పడానికి వస్తున్నామని, ఇదేం కుస్తీ యుద్ధం కాదని, పోరాటం కాదని వారు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వారి గొంతుగా స్పందిస్తున్నామని హరీశ్ రావు చెప్పారు. తమకు ఎలాంటి బేషజాలు లేవని, ఎలాంటి గొడవలు వద్దని, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామని సూచించారు. అయితే హరీశ్ రావును పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీనిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు పిలిచి పోలీసులతో అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. పాలకులు తప్పు చేశారు కాబట్టే తమను పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు. గురుకులాల టెండర్లలో ముమ్మాటికీ అవినీతి జరిగిందని, బ్రోకర్లకు టెండర్లు అప్పగించారని ఆరోపించారు. తాను వచ్చే వరకు మంత్రులు అక్కడే ఉండాలని, ఎక్కడికీ పారిపోవద్దని సూచించారు. పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది.

