కలం, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో తుపాకీ బుల్లెట్లు దొరకడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొవ్వూరు మండలం పంగిడి వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది. తనిఖీలు చేస్తున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అహ్మద్ సమీర్ హుస్సేన్ వద్ద తుపాకీ బుల్లెట్లు లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అహ్మద్ సమీర్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అహ్మద్ సమీర్ హుస్సేన్ గత ఏడేళ్లుగా జిల్లాలోని దేచర్ల గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలో పలు నేర చరిత్ర ఉన్న ఆదిత్య రాజ్ అనే వ్యక్తి ఈ బుల్లెట్లను హుస్సేన్కు సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిద్దరికీ మధ్య ఉన్న సంబంధం, ఈ బుల్లెట్లను ఎక్కడ ఉపయోగించాలనుకున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆదిత్య రాజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు పెంచడంతో పాటు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


