కలం, వెబ్ డెస్క్: గడిచిన దశాబ్ద కాలంలో గుజరాత్ (Gujarat) రాష్ట్రం మలేరియా అడ్డుకట్టలో అద్భుతమైన పురోగతిని సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. గత పదేండ్లలో రాష్ట్రంలో మలేరియా కేసుల సంఖ్య 92శాతం భారీగా తగ్గింది. 2014వ సంవత్సరంలో సుమారు 46,000గా నమోదైన మలేరియా కేసులు, 2023 నాటికి కేవలం 3,500కి పడిపోయాయి. ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ, ముందస్తు జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు చేసిన కృషితోనే ఘనత సాధ్యమైందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయడం, మారుమూల గ్రామాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టడం లాంటివి కీలక పాత్ర పోషించాయి. మలేరియా (Malaria) సోకిన వారిని వెంటనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలిగారు. 2030 నాటికి రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో మలేరియా రహిత గుజరాత్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

