కలం, భైంసా: శ్రీకృష్ణ జన్మాష్టమిని (Sri Krishna Janmashtami Celebrations) పురస్కరించుకొని భైంసా (Bhainsa) పట్టణంలోని రామ్లీలా మైదానంలో హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో యువతలో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా మంజూరైన శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, హిందూ వాహిని నాయకులు తదితరులు పాల్గొన్నారు.

