కలం, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కవిత వెనుక ఎవరో ఉండి కీలుబొమ్మలా ఆడిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Suntiha) కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారాయని, ముఖ్యంగా కేసీఆర్ ను కంటతడి పెట్టించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేశాయని అన్నారు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే కవిత మాత్రం సభకు హాజరుకావడాన్ని సునిత తప్పుబట్టారు.
కవిత మనస్ఫూర్తిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదని అదంతా నాటకమని ఆమె ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేకపోతే కవిత ఇన్ని పదవులు ఎలా దక్కాయని.. ఓడిపోయినా ఆమెకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదని సూచించారు. కవిత మాటలు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా మారడం ఇష్టంలేదంటున్నారని.. మరి తెలంగాణ జాగృతి పేరును భారత జాగృతి గా ఎలా మార్చారని సునిత నిలదీశారు. బీఆర్ఎస్ ను ఆగం చేయడానికి కవిత కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు కేటీఆర్, హరీశ్ రావు వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లూ ఆమె కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కవిత పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని సునీత ధ్వజమెత్తారు.

Read Also: కవిత పార్టీ ప్రకటనపై బీజేపీ స్పందన ఇదే..
Follow Us On: Instagram


