కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ చెస్ ఆటగాళ్ళు ఇప్పుడు ఒకే చోట చేరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ఎక్స్పో హాల్లో జూన్ 10 నుండి 18 వరకు ప్రతిష్టాత్మక మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఇండియన్ చెస్ స్కూల్ నిర్వహిస్తున్న 60 లక్షల రూపాయల మొత్తం ప్రైజ్ మనీ గ్లోబల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్లో 16 దేశాల నుండి 58 మంది అగ్రశ్రేణి ఆటగాళ్ళు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో నలుగురు గ్రాండ్మాస్టర్లు, 34 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఆరుగురు ఫిడే మాస్టర్లు, ఇద్దరు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఇద్దరు క్యాండిడేట్ మాస్టర్లు ఉన్నారు.
క్లాసికల్ ఫార్మాట్లో 9 రౌండ్ల స్విస్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ సాగనుంది. ఆటగాళ్ళు తమ రేటింగ్ పాయింట్లను పెంచుకోవడానికి, టైటిల్ నార్మ్స్ సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ మాస్టర్స్ సెక్షన్ కోసం మాత్రమే 35 లక్షల రూపాయల ప్రైజ్ ఫండ్ కేటాయించారు. ఇందులో విజేతగా నిలిచిన ఆటగాడికి 8 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. ప్రస్తుతం 2573 రేటింగ్తో జాతీయ ఛాంపియన్, తమిళనాడుకు చెందిన జిఎం ఇనియన్ పిఎ టాప్ సీడ్గా బరిలోకి దిగుతున్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో జిఎం సంకల్ప్ గుప్తా, జిఎం అభిజీత్ గుప్తా ఉన్నారు. ఈ పోటీల్లో భారతదేశం నుండి 32 మంది ఆటగాళ్లు పాల్గొంటుండగా.. అమెరికా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బ్రిటన్, కెనడా వంటి మరో 15 దేశాల ఆటగాళ్లు తలపడుతున్నారు. దీనితో పాటే ‘360 వన్ గ్లోబల్ ఛాలెంజర్స్ బి కేటగిరీ’, ‘జూనియర్ మాస్టర్స్’ టోర్నమెంట్లు కూడా జరగనున్నాయి. 2300 లోపు రేటింగ్ ఉన్న ఆటగాళ్ల కోసం ఉద్దేశించిన ఈ బి కేటగిరీ పోటీల్లో ఈసారి రికార్డు స్థాయిలో 225 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో ఎఫ్ఎమ్ మాధ్వేంద్ర ప్రతాప్ శర్మ టాప్ సీడ్గా ఉన్నారు. ఈ ఛాలెంజర్స్ సెక్షన్లో గెలిచిన విజేతకు రేటింగ్తో సంబంధం లేకుండా 2027లో జరిగే మాస్టర్స్ టోర్నమెంట్కు నేరుగా అర్హత లభిస్తుంది.

