కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం(Bhadrachalam) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా నిలిచిపోయిన జనరల్ సర్జన్ సేవలు (General Surgeon Services) ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. జనరల్ సర్జన్గా విధులు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణ ఇటీవల మణుగూరుకు బదిలీ కావడంతో శస్త్రచికిత్సల కోసం వచ్చే పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర శస్త్రచికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో రోగులపై అదనపు ఆర్థిక భారం పడింది. ఈ సమస్యను గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ రామకృష్ణ సేవలను భద్రాచలం, మణుగూరు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ రామకృష్ణ ప్రతి వారం సోమవారం, మంగళవారం, బుధవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జన్గా సేవలందిస్తూ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. గురువారం, శుక్రవారం, శనివారం మణుగూరులో విధులు నిర్వర్తిస్తారు. దీంతో రెండు ప్రాంతాల ప్రజలకు ఒకే వైద్యుని సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు, రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, పేద రోగులకు సమయానికి వైద్యం అందే అవకాశం ఏర్పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

