కలం, ఖమ్మం బ్యూరో: బ్యాడ్మింటన్లో రికార్డులు సృష్టిస్తున్న ప్రముఖ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి (Gayatri Gopichand) ప్రతిష్ఠాత్మక ‘అర్జున అవార్డు’ దక్కడం గర్వకారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. అర్జున అవార్డుకు గాయత్రి ఎంపికైన సందర్భంగా ఆయన మంగళవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ గాయత్రి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుండటం అభినందనీయమన్నారు.
పిన్న వయసులోనే క్రమశిక్షణ, నిరంతర శ్రమతో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగి ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషమన్నారు. గాయత్రి సాధించిన ఈ గొప్ప ఘనత నవతరం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న గాయత్రి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించి, దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మరింత వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు.

