కరీంనగర్‌లో ఘనంగా గోసమేత తిరంగా ర్యాలీ

కలం, కరీంనగర్: గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ ప్రజల్లో దేశభక్తిని, గోసంరక్షణపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. ​నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని అట్టహాసంగా ప్రారంభించారు.

తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బస్టాండ్ వరకు సాగి, తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, గోమాత జాతీయ మాతగా గుర్తింపు పొందాలని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.

​ఈ కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మద్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఫౌండేషన్ సభ్యులు జూపెల్లి ధీరజ్, కో-ఫౌండర్లు వేణు, దీపక్, అదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>