భద్రాద్రిలో ఇంధన సెగ.. సాధారణ పెట్రోల్ నిల్, పవర్ పెట్రోల్ ఫుల్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పట్టణాలలో పెట్రోల్, డీజిల్ కొరత (Fuel Shortage) తీవ్ర రూపం దాల్చింది. గత రెండు రోజులుగా ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా జిల్లాలోని పలు పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి స్టాక్ కోసం వాహనదారులు ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన బంకుల్లో సాధారణ పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో, యాజమాన్యాలు కేవలం ‘పవర్’ పెట్రోల్‌ను మాత్రమే విక్రయిస్తున్నాయి. లీటరుకు అదనంగా చెల్లించాల్సి వస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి వాహనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. “సాధారణ పెట్రోల్ అడిగితే లేదని చెబుతున్నారు, పవర్ పెట్రోల్ పోయించుకోలేక ఇబ్బంది పడుతున్నాం” అని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీజిల్ కొరత కారణంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆటోలు, లారీలు, ఇతర భారీ వాహనాలు బంకుల వద్దే నిలిచిపోయాయి. పలు చోట్ల “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తుండటం తో అంతరాష్ట్ర ప్రయాణికులు, అత్యవసర పనులపై వెళ్లే వారు మార్గమధ్యలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా టిన్నులు, క్యాన్లలో ఇంధనాన్ని భారీగా నింపుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల క్యూలో ఉన్న సామాన్యులకు ఇంధనం అందడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నెలకొన్న ఈ కృత్రిమ కొరతను నివారించడానికి పౌర సరఫరా అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరాను క్రమబద్ధీకరించి, అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>