కలం, వెబ్డెస్క్: ఇంధన కొరతతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల ముందు జనం క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో చాలా చోట్ల బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్ బోర్డులతో బంకులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని తిరుపతి (Tirupati) జిల్లాలోని తనపల్లిలో ఓ బంకు యజమాని చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఒక్కసారిగా జనాలందరినీ తన బంకు ముందుకు రప్పించింది. ఇంతకీ ఆ బంకు యజమాని చేసిన ప్రకటన ఏంటని అనుకుంటున్నారా..? ప్రతి టూ వీలర్కు లీటర్ పెట్రోల్ ఫ్రీ (Free Petrol) అని ప్రకటించాడు. ఇంకేముంది ఇప్పటికే పెట్రోల్ కొరతతో అవస్థ పడుతున్న జనం అతని బంకు ముందు క్యూ కట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వాహనదారులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ ఒక్క రోజు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నట్లు బంకు యజమాని రాజేష్ రెడ్డి వెల్లడించారు.

