కలం, వెబ్డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).. ఈ పేరు వింటేనే స్టేడియం హోరెత్తుతుంది. అయితే ఐపీఎల్ (IPL) 2026 సీజన్ మొదలై ఇన్ని రోజులవుతున్నా ధోనీ ఒక్క మ్యాచ్లోనూ కనిపించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఈ క్రమంలో ధోనీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే విషయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. గత నెలలో తగిలిన పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆయన స్థానంలో సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధోనీ గాయం నుంచి కోలుకున్నారని వార్తలు వస్తున్నా, ఆయన ఎందుకు బరిలోకి దిగడం లేదనే దానిపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో కీలక విశ్లేషణ చేశారు.
ధోనీ కేవలం తన జట్టు ప్లేఆఫ్స్ రేసు నుండి పూర్తిగా తప్పుకున్నప్పుడు మాత్రమే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెన్నై జట్టుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయని, ఇలాంటి సమయంలో జట్టులో ఉన్న కాంబినేషన్ను మార్చడం ధోనీకి ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ సీఎస్కే అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమిస్తేనే, అభిమానుల కోరిక మేరకు ధోనీ చివరి కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని అశ్విన్ వివరించారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఆరో స్థానంలో ఉంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి సీఎస్కే అవకాశాలను కాస్త దెబ్బతీసింది. గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరని చెన్నైకి, ఈసారి ప్లేఆఫ్స్ చేరడం ఎంతో ప్రతిష్టాత్మకం. వచ్చే శనివారం ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్ జట్టు భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ ముంబైపై గెలిస్తే చెన్నై రేసులో ముందుకు వెళ్తుంది.

