కలం, వెబ్డెస్క్: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా ప్రభుత్వ మోడల్ బేసిక్ హైస్కూల్ గ్రౌండ్స్లో శ్రీ హనుమాన్ కరాటే & యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 42 రోజులుగా ఎంతో ఉత్సాహంగా సాగిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మేయర్ గుమ్మల మమతా శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, స్థానిక కార్పొరేటర్ శరత్ బాబు, ఎన్పీ నేహా శ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇచ్చే కరాటే, యోగా వంటి యుద్ధ విద్యలను నేర్చుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా నేటి సమాజంలో బాలబాలికలు ఆత్మరక్షణ విద్యలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించి, 42 రోజుల పాటు పిల్లలకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇచ్చిన అసోసియేషన్ నిర్వాహకులను, మాస్టర్లను వారు ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు, కరాటే విన్యాసాలు, సాహసోపేతమైన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, శిక్షకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

