కలం, చండూరు (మర్రిగూడ ): కంటి సమస్యలున్న వారు పరీక్షలు చేయించుకుని, వైద్యుల సిఫార్సు మేరకు ధైర్యంగా ఆపరేషన్లు చేయించుకోవాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ (Marriguda) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకర కంటి ఆసుపత్రి ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన వృద్ధులను ఆమె ఆత్మీయంగా పలకరించారు. ఆపరేషన్ అవసరం లేని వారికి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించారు. ఆపరేషన్ అవసరమైనవారిని ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేశారు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 9,766 మందికి కంటి పరీక్షలు చేయించినట్లు కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి వివరించారు. 2,198 మందికి ఆపరేషన్లు, 4,227 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

