కలం, జనగామ : జనగామ (Jangaon) పట్టణంలో నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక నకిలీ బంగారం బిస్కెట్ను (Fake Gold Biscuit) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన తురక చెన్నయ్య (52), తిన్నెడు గంగరాజు (36), అంబుజ (60), తిన్నెడు అంకమ్మ (65) కలిసి నకిలీ బంగారం బిస్కెట్ను అసలు బంగారమని నమ్మిస్తూ విక్రయించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో బాధితుడికి బంగారం బిస్కెట్ను చూపించి తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జనగామ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక నకిలీ బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ జె. నర్సయ్య, ఏఏఓ మహ్మద్ సల్మాన్, సిబ్బంది కరుణాకర్, బి. కృష్ణ, జి. రవి తదితరులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. ప్రజలు నకిలీ బంగారం మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

