కలం, వనపర్తి: విద్యార్థులతో మమేకమై.. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Singireddy Niranjan Reddy) . వనపర్తి మండలం అంజనగిరి (Anjanagiri) గ్రామంలోని పాఠశాలలో ‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన.. పరిశుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఆ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు మంగళవారం పాఠశాలకు వచ్చి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి (Niranjan Reddy) మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, చదువుపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని సూచించారు.
విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శిస్తూ విద్యా వసతులు, మౌలిక సదుపాయాలు, ఆహార నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
విద్యార్థులతో ఆప్యాయంగా..
భోజనానంతరం విద్యార్థులతో నిరంజన్రెడ్డి ఆప్యాయంగా ముచ్చటించారు. మనకు ఆహారాన్ని అందించే రైతులు, రైతు కూలీల పాత్రను వివరించి.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు రైతులను కూడా గౌరవించాలని సూచించారు. విద్యార్థులకు చాక్లెట్లు, అరటిపండ్లు అందించి వారిని ఉత్సాహపరిచారు. మాజీ మంత్రి స్వయంగా భోజనం వడ్డించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నందిమల్ల అశోక్, కె. మాణిక్యం, సర్పంచి నేనావత్ శాంతమ్మ దేవకుమార్, రఘువర్ధన్రెడ్డి, ధర్మానాయక్, రవిప్రకాష్రెడ్డి, మాధవ్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, నరేష్, చిట్యాల రాము, ఉపసర్పంచి రాజు, ధర్మేందర్, యాదగిరి, వాసు, తిరుపతయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన
Follow Us On : WhatsApp

