కలం, కరీంనగర్ బ్యూరో: కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా.. ఎంతో మంది తమ కుటుంబాల పోషణకు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు గదులు అద్దెకు తీసుకుని దుకాణాలు నడిపించుకుంటే.. చిరు వ్యాపారులు మాత్రం ఫుట్ పాత్ ల మీదనే వ్యాపారం చేస్తుంటారు.. ఫుట్ పాత్ ల పై వ్యాపారం చేయడం నిబంధనలకు విరుద్ధమైనా.. పోనీలే పాపం అని అటు.. కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ అధికారులు గానీ, ఇటు.. ప్రజలు గానీ ఊరుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుంటున్న చిరు వ్యాపారులు హద్దులు మీరుతున్నారు.
ఫుట్ పాత్ లే కాదు, పార్కింగ్ ఏరియాలను కూడా ఆక్రమిస్తున్నారు. కొందరైతే మరొక అడుగు ముందుకేసి రోడ్లను కూడా ఆక్రమించి వ్యాపారం చేస్తూ వాహనదారులకు, కాలి నడకన వెళ్ళే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నా.. మున్సిపల్ అధికారులకు కానరావడం లేదు. ‘మాకు అడ్డు ఎవరు’ అనే ధీమాతో, యథేచ్ఛగా చిరు వ్యాపారులు ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం సమీపంలో నిత్యం ట్రాఫిక్ జామ్ తో పాటు.. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా నగర పాలకులకు కూడా ప్రజల అవస్థలు పట్టకపోవడం పైన ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

