కలం, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంట (Jammikunta) పట్టణంలో ఆహార భద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరు కాంప్లెక్స్ ప్రాంతంలోని వివిధ కిరాణా హోల్సేల్ దుకాణాలు, గ్రెయిన్ మార్కెట్ రోడ్ ప్రాంతంలోని ఆయిల్ మిల్లులను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. సేకరించిన నమూనాలలో జమ్మికుంటలోని రెండు ఆయిల్ మిల్లులలో ఉత్పత్తి చేసిన వేరుశెనగ నూనె, శనగపప్పు, వేరుశెనగలు, అలాగే వివిధ రకాల కాన్ఫెక్షనరీ (మిఠాయి) ఉత్పత్తులు ఉన్నాయి.
సేకరించిన నమూనాలను విశ్లేషణ నిమిత్తం గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం ఆయా ఆహార వ్యాపార సంస్థలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఆహార వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగదారులకు విక్రయించాలని ఆహార భద్రత శాఖ సూచించింది.

