కలం, కరీంనగర్ బ్యూరో : ప్రముఖ ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) వివాదంలో చిక్కుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక రెడ్డి భవన్ గదిలో తోటి నటి మాధురి రాథోడ్తో కలిసి ఉన్న సమయంలో ఆయన భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాసింగా బాసింగా బలాలే, ప్రమీల ఓ ప్రమీల వంటి ఎన్నో ప్రాచుర్యం పొందిన ఫోక్ సాంగ్స్ ద్వారా వీరిద్దరూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు శరణ్య వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వ్యవహారంపై భార్య శరణ్య తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తూ ఆవేదన చెందారు. తమకు వివాహమై ఏడేళ్లు అవుతోందని, తన భర్తకు మద్యపానం లాంటి అలవాట్లు కూడా లేవని తెలిపారు. గతంలో మాధురి రాథోడ్కు బ్రేకప్ అయినప్పుడు తానే స్వయంగా ఓదార్చానని, కానీ తన పక్కనే ఉంటూ ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయానని చెప్పారు.
ఎప్పుడూ తమ కళ్ల ముందే ఉండే ఆ అమ్మాయి మంచిదని భావించానని, అయితే వారిద్దరి మధ్య నడిచిన ఫోన్ మెసేజ్లు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఒకానొక దశలో ఈ విషయమై మనస్తాపంతో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. తన భర్త మంచోడే అని, కానీ ఇతర మహిళల ప్రవర్తన వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ, ఇటువంటి వారిని ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని విజ్ఞప్తి చేశారు.
ఫోక్ ఇండస్ట్రీలో ‘కమిట్మెంట్ల’ కల్చర్పై చర్చ
ఫోక్ ఇండస్ట్రీలో షూటింగ్స్ పేరుతో కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫిమేల్ ఆర్టిస్టులను అనవసరమైన ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్ల డబ్బు, సమయం వృథా చేస్తూ ఒకరోజులో పూర్తయ్యే షూట్లను రెండు, మూడు రోజులకు పొడిగించడం.. ఆ తర్వాత వ్యక్తిగత ‘కమిట్మెంట్లు’ పేరుతో మహిళా ఆర్టిస్టులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఆరోపణలు ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తున్నాయి. వేములవాడలోని ప్రముఖ భవన్లో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఈ ఘటనతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు, బాధ్యుల వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

