ఫిఫా వరల్డ్ కప్ జట్లకు భారీ ఊరట

కలం, వెబ్ డెస్క్: 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ (Football World Cup)లో పాల్గొనే జట్లకు ఫిఫా ఒక తీపి కబురు అందించింది. ఉత్తర అమెరికాలో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో, జట్లకు అదనంగా 100 మిలియన్ డాలర్లకు పైగా నిధులు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వాంకోవర్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ నిధుల పెంపునకు ఆమోదం లభించింది. ఈ కొత్త నిర్ణయంతో ప్రతి దేశానికి అందే కనీస హామీ మొత్తం 12.5 మిలియన్ డాలర్లకు చేరింది. గతంతో పోలిస్తే ఇది 2 మిలియన్ డాలర్లు ఎక్కువ. అలాగే, ప్రాథమిక ప్రైజ్ మనీని కూడా 10 మిలియన్ డాలర్లకు పెంచారు. టోర్నీకి ముందు జరిపే సన్నాహాల కోసం ఇచ్చే నిధులను 1.5 మిలియన్ల నుండి 2.5 మిలియన్ డాలర్లకు పెంచుతూ ఫిఫా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ప్రతినిధుల ఖర్చుల కోసం మరో 16 మిలియన్ డాలర్లను సబ్సిడీ రూపంలో కేటాయించనున్నారు.

అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఈ టోర్నీ జరగనుంది. మూడు దేశాల్లో నిర్వహించడం వల్ల ప్రయాణ, వసతి ఖర్చులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా అమెరికాలో ఆడే జట్లకు కొన్ని పన్ను నిబంధనలు అదనపు భారంగా మారాయి. ఫిఫా కేవలం 50 మంది సభ్యులకు మాత్రమే వసతి కల్పిస్తుంది. కానీ జట్లు అంతకంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చుల వల్ల యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తదుపరి దశలకు వెళ్లకపోతే జట్లు నష్టపోయే అవకాశం ఉందని ఫిఫా దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అదనపు నిధులు మంజూరయ్యాయి. 2026 ప్రపంచకప్ ద్వారా ఫిఫా సుమారు 11 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 655 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈసారి విజేతగా నిలిచే జట్టుకు 50 మిలియన్ డాలర్లు దక్కుతాయి. గతంలో అర్జెంటీనా గెలుచుకున్న మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>