కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో కుదేలవుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై.. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన జట్టు పరిస్థితిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నుంచి తప్పుకుని బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముంబై జట్టు వైఫల్యాలకు మూలకారణాన్ని వెతకాలని తివారీ సూచించారు. 2013 నుండి 2023 వరకు రోహిత్ శర్మ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించారని గుర్తు చేశారు. రోహిత్ను కెప్టెన్సీ నుండి తొలగించడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. హార్దిక్ నాయకత్వం బలహీనంగా ఉందని.. జట్టును నడిపించడంలో ఆయన విఫలమవుతున్నారని ఆయన (Manoj Tiwary) విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్దిక్ స్వయంగా వెనక్కి తగ్గి రోహిత్కు పగ్గాలు ఇవ్వడమే సరైన పరిష్కారమని పేర్కొన్నారు.
పంజాబ్ మ్యాచ్లో హార్దిక్ తీసుకున్న నిర్ణయాలపై తివారీ మండిపడ్డారు. హిట్టర్ రూథర్ఫోర్డ్ కంటే ముందు హార్దిక్ బ్యాటింగ్కు రావడం తప్పుడు నిర్ణయమని విమర్శించారు. కేవలం 12 బంతుల్లో 14 పరుగులు చేసిన హార్దిక్ కంటే రూథర్ఫోర్డ్ ఎక్కువ బంతులు ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పారు. అలాగే స్వింగ్ చేయలేకపోతున్న దీపక్ చాహర్తో బౌలింగ్ ప్రారంభించడంపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. జస్ప్రీత్ బుమ్రాకు మొదటి ఓవర్ ఇవ్వకుండా రెండో ఓవర్ ఇవ్వడంలో అర్థం లేదని తివారీ విశ్లేషించారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తమ తదుపరి మ్యాచ్లలో ఏ మేరకు పుంజుకుంటుందో వేచి చూడాలి.

