కలం, పాలకుర్తి : దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (Errabelli Dayakar Rao) ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాటల గారడీతో రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు దేవరుప్పుల ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా, ‘వంటా-వార్పు’లో ఎర్రబెల్లి తన సతీమణి ఉషాతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ. 2500, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రైతుబంధు, కేసీఆర్ కిట్, పెన్షన్లను ఎగ్గొట్టారని విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన (Errabelli Dayakar Rao) పిలుపునిచ్చారు. అధికారం ఉన్నా లేకున్నా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పల్లా భార్గవి, బస్వ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

