కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. నందిపాడు గ్రామంలో 9 సంవత్సరాల చిన్నారిపై ఓ 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… వేసవి సెలవులు కావడంతో ఓ తొమ్మిదేళ్ల బాలిక నందిపాడు గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో స్థానికంగా దుకాణం నడుపుకునే లక్ష్మణ రావు (60) అనే వృద్ధుడు, ఆ బాలికను లోపలి గదిలోకి తీసుకెళ్లి దురాగతానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు.
బాలికతో పాటు వచ్చిన మరో చిన్నారి ఈ విషయాన్ని గమనించి, వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో లక్ష్మణ రావు దారుణం బయటపడింది. ఆందోళనకు గురైన బాలిక బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఎస్ఐ యయాతిరాజు వెంటనే స్పందించారు. నిందితుడు లక్ష్మణ రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

