కలం, వెబ్ డెస్క్ : చిన్న తరహా వ్యాపారాలు చేయాలనుకునే డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. స్త్రీనిధి (Stree Nidhi) ద్వారా అందించే రుణ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం ఇస్తున్న లక్ష రూపాయల రుణానికి అదనంగా మరో రెండు లక్షల వరకు ప్రభుత్వం అందించనుంది.
ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రాయితీతో రూ.4 లక్షల వరకు రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న మహిళలకు మాత్రమే ఈ అదనపు రుణాలు మంజూరు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రేపటి నుంచి నెల రోజుల పాటు ‘సెర్ప్’ (SERP) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

