కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా దుబాయ్ (Dubai)లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ భవనంలో నివసిస్తున్న వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే అక్కడి ఎయిర్ లైన్స్ ముసివేసిన విషయం తెలిసిందే.
దుబాయ్ (Dubai)తో పాటు అబుదాబి, ఖతార్, రియాద్ వంటి ప్రధాన నగరాలపై ఇరాన్ దాడులకు దిగినట్లు సమాచారం అందుతోంది. ఈ దాడుల ప్రభావం బుర్జ్ ఖలీఫా వంటి కీలక కట్టడాలపై పడకుండా ఉండేందుకు దుబాయ్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కీలక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

