కలం, వెబ్ డెస్క్ : భారత అంతర్గత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం (DDR&D) సెక్రటరీ, అత్యాధునిక శాటిలైట్ ఇమేజింగ్ వ్యవస్థ ‘ప్రజ్ఞ’ (Prajna)ను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అధికారికంగా అందజేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్-3లో ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
డీఆర్డీఓ (DRDO) పరిధిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) ల్యాబ్ ఈ వ్యవస్థను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, హోం మంత్రిత్వ శాఖకు అత్యవసర సమయాల్లో రియల్ టైమ్ డేటాను అందిస్తుంది. దీని ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత భారత అంతర్గత రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, నిఘా వ్యవస్థ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

