కలం, సినిమా : కోలీవుడ్ స్టార్ సూర్య, మమిత బైజు జంటగా టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఊటీలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ చిరుతపులి తప్పించుకుని సినిమా సెట్ వైపు వచ్చిందని వెంకీ అట్లూరి తెలిపారు. అది తన కళ్ల ముందుగానే వెళ్లిందని.. ఆ సమయంలో సెట్లో జరిగిన ఈ ఘటన తమకు షాక్తో పాటు ఆసక్తికర అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో షూటింగ్కు సంబంధించిన మరో విషయాన్ని వెంకీ అట్లూరి వెల్లడించారు. ఊటీలో గడ్డకట్టేంత చలిలో సూర్య, మమిత బైజు 11 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. అంతేకాకుండా 102-103 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ షూటింగ్కు హాజరై సన్నివేశాలను పూర్తి చేశారని చెప్పారు. సినిమా కోసం నటీనటులు పడిన కష్టాన్ని దర్శకుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరుతపులి ఘటనతో పాటు షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

