కలం, వలిగొండ: రాష్ట్రవ్యాప్తంగా డీజిల్ కొరత కొనసాగుతుండగా అది క్రమంగా వలిగొండ (Valigonda) మండలానికి కూడా తాకింది. డీజిల్ కొరత రోజు రోజుకు పెరిగిపోతుండగా వలిగొండ లోని మూడు పెట్రోల్ బంకులలో సోమవారం ఉదయం నాటికి డీజిల్ పూర్తిగా ఖాళీ అయింది. అయితే మండలంలోని నాగారం గ్రామంలో ఉన్న బంకులో మాత్రం డీజిల్ ఉంది. ఈ విషయం తెలిసి నాగారం గ్రామంలో ఉన్న బంకుకు వినియోగదారులు పొటెత్తారు. వాహనాలతో, క్యాన్లతో పరుగులు తీశారు. ఒకేసారి పెద్ద ఎత్తున డీజిల్ కోసం వచ్చి క్యాన్లతో గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్నారు.
కాగా, డీజిల్ కొరత కారణంగా వరి కోతలు కోసే హార్వెస్టర్లు డీజిల్ లేక ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆరుగాలను కష్టించి రైతులు పండించిన పంట చేతికి రావడం ఇబ్బందిగా మారి రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడనుంది.

