కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్పై కఠిన చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. కాలేజీ, యూనివర్సిటీలపైనా నజర్ పెట్టింది. ఇప్పటివరకు.. విద్యా సంస్థల్లో డ్రగ్స్ తో ఎవరైనా పట్టుబడితే, కేవలం వారిపైనే కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడమో.. తీవ్రతను బట్టి రిమాండ్ చేయడమో చేస్తున్నారు. పబ్లో డ్రగ్స్ దొరికితే పబ్ మేనేజ్మెంట్పై ఎలా కేసులు నమోదు చేస్తారో, ఇక నుంచి ఏ విద్యాసంస్థలో అయితే డ్రగ్స్ దొరుకుతాయో.. అది వినియోగించినవారితో పాటు యాజమాన్యాలపైనా కేసులు పెడుతామని డీజీపీ (DGP) సీవీ.ఆనంద్ ప్రకటించారు. ఇది సవాల్తో కూడుకున్న వ్యవహారమే అయినా, డ్రగ్స్ నియంత్రణ కోసం ఇలాంటి చర్యలు తప్పవన్నారు. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఇతర ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి.. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేస్తామని వివరించారు.
నగర పరిధిలోనే ఎక్కువ కేసులు..
హైదరాబాద్ నగర పరిధిలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ తీసుకుంటూ విద్యార్థులు పట్టుబడుతున్న ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవలే, బేగంపేట్లోని ఒక హోటల్ మేనేజ్మెంట్/క్యులినరీ ఇన్స్టిట్యూట్లో 11 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకోగా.. వారిలో ఆరుగురు పాజిటివ్గా తేలారు. ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ మహమ్మారి అరికట్టడంలో విద్యాసంస్థలు అలసత్వం ప్రదర్శిస్తున్నందునే.. కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

