కలం, వెబ్ డెస్క్: దేశంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) మంగళవారం కొత్త నిబంధనలు ప్రకటించింది. ముఖ్యంగా నాన్–షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్పై కఠిన చర్యలకు సిద్ధమైంది. భద్రతా నిబంధనలు పాటించని సంస్థలపై జరిమానా విధించడంతోపాటు లైసెన్స్లు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. సంస్థల బాధ్యత మేనేజర్లు, ఉన్నతాధికారులపై ఉంటుందని స్పష్టం చేసింది. నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్ విమానాల్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆడిట్లు పెంచనున్నట్లు చెప్పింది. అనుమతి లేకుండా జరిగే కార్యకలాపాలు గుర్తించేందుకు టెక్నికల్ ల్యాగ్ బుక్స్ పరిశీలిస్తామని పేర్కొంది. అన్ని నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లకు సేఫ్టీ ర్యాంకింగ్ విధానం అమలు చేసి, వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తామని చెప్పింది.
ప్రయాణికులపైనా కఠిన చర్యలు..
విమానాల్లో నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులపైనా డీజీసీఏ(DGCA) కఠిన చర్యలు తీసుకోనుంది. దీనికోసం జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపింది. విమానాల భద్రత, ప్రయాణికుల రక్షణ, ప్రశాంత వాతావరణం కాపాడేందుకు దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పింది. ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను బట్టి విమానాల్లో ప్రయాణం నిషేధంతోపాటు మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు శిక్షలు విధించనున్నట్లు వెల్లడించింది. విమానంలో పొగ త్రాగడం, డొమెస్టిక్ విమానాల్లో మద్యం సేవించడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దుర్వినియోగం, లైఫ్ జాకెట్లను అనవసరంగా, అనుమతి లేకుండా వినియోగించడం వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించనున్నట్లు తెలిపింది. వీటిపై పర్యవేక్షణ, నియంత్రణకు ప్రతి ఎయిర్లైన్స్ స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేయాలని చెప్పింది.

