కరీంనగర్‌ను బీహార్‌లా మార్చాలని చూస్తున్నారా? : రామకృష్ణారావు

కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్‌ను మరో బీహార్‌లా మార్చాలని చూస్తున్నారా? అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీ.వీ.రామకృష్ణారావు (GV. Ramakrishna Rao) బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరంలోని నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపుపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విధంగా అధికారిక కేంద్రాలపై దాడులు జరగడం ఇప్పటివరకు చూడలేదన్నారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి గూండాలను ప్రోత్సహిస్తే దేశ సైనికులకు ఏ సందేశం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ గతంలో చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సమాధానం ఇచ్చారని, ఆ ఆరోపణలు కోర్టుల్లో కూడా నిలబడలేదని ఆయన (GV Ramakrishna Rao) గుర్తు చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌లను బద్నాం చేయడమే బీజేపీ లక్ష్యం అని విమర్శించారు. దొంగ దెబ్బలు కాదు, దమ్ముంటే బహిరంగంగా చెప్పి చేయండి.. మా శక్తి ఏంటో చూపిస్తాం అని రామకృష్ణారావు సవాల్ విసిరారు. దాడి ఘటనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దాడిని సమర్థించినట్లుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉండటంతో రెండు పార్టీల వైఖరి ఒకటేననే అనుమానం కలుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను చూసి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని.. బెంగాల్‌లో కూడా వేరే పార్టీ నాయకులను తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు అని బీజేపీపై విమర్శలు గుప్పించారు. రైతులు, హిందువులు ఇబ్బందులు పడుతున్నా వారి సమస్యలపై ఒక్క మాట మాట్లాడడం లేదు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు.

కాకతీయులు నిర్మించిన 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చితే హిందుత్వం గురించి మాట్లాడడం లేదని.. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరాడితే విమర్శిస్తారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌ను మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాల కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని రామకృష్ణారావు ఆరోపించారు. బండి సంజయ్, బీజేపీ వైఖరికి నిరసనగా రేపు (శనివారం) నిర్వహించే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తారని జీ.వి. రామకృష్ణారావు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>