కలం, ఖమ్మం బ్యూరో: సాధారణంగా పెళ్లి పత్రికలు బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఆహ్వానించేందుకు ప్రింట్ చేయిస్తారు. కొందరు తమ పెళ్లి పత్రికలను విభిన్నంగా డిజైన్ చేయించుకుంటారు. పెళ్లి పత్రికలపై వధూవరుల వివరాలతో పాటు ఫోటోలు వచ్చేలా వినూత్నంగా ప్రింట్ చేయిస్తారు. కానీ ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలోని ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో త్వరలో జరగనున్న వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రిక స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ పత్రికతో విధి నిర్వహణలోనే కాకుండా సొంత పనుల్లో కూడా సమాజం పట్ల బాధ్యతను కనబరుస్తున్న ఆ పోలీస్ కానిస్టేబుల్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ శుభలేఖలో ఏముందంటే.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించే హెచ్చరికలు ఉన్నాయి. ప్రధానంగా మెసేజ్ లింకులు ఓపెన్ చేయొద్దని, గిఫ్ట్ల ఆశ చూపి అకౌంట్ వివరాలు అడుగుతుంటారు, కాబట్టి ఉచిత గిఫ్ట్ల కోసం ఆశ పడొద్దని, అలాగే పబ్లిక్ వైఫైతో భద్రంగా ఉండాలంటూ పలు హెచ్చరికలతో ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె వివాహం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరరావు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే వినూత్న పెళ్లి పత్రికను తయారు చేయించారు. బంధువులు, స్నేహితులకు వివాహ ఆహ్వానం పలుకుతూనే, సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా ‘సామాజిక స్పృహ ఉన్నవారికి కాదేది అనర్హం’ అన్నట్లు, శుభలేఖ పై ఒక మంచి సందేశం ప్రింట్ చేయించి, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పంచే ప్రయత్నం చేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు. దీంతో కొంత మంది అయినా అప్రమత్తంగా ఉంటారనే నాగేశ్వరరావు ఆలోచన ఎంతో మందికి ఆదర్శం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

