కలం, ఖమ్మం బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ‘వీబీ-జీ -రామ్ జీ’ పథకంగా మార్చడం జాతిపితనే అవమానించడమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్ పాషా మండిపడ్డారు. భద్రాచలం(Bhadrachalam)లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బడ్జెట్ నిధుల్లో కోత విధిస్తూ, రాష్ట్రాల మధ్య వేతన వివక్ష చూపుతూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
ఏపీలో విలీనం చేసిన అయిదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగిస్తేనే భద్రాచలం (Bhadrachalam) ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న కరకట్ట నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
6న చలో హైదరాబాద్..
పేదల భూ సమస్యల పరిష్కారం కోసం “ప్రతి గుడిసెకు పట్టా” అనే నినాదంతో ఈ నెల ఆరో తేదీన కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ (Chalo Hyderabad) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సాబీర్ పాషా తెలిపారు. జిల్లాలో ఇంకా 2.40 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని, గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలు కల్పించాలని కోరారు.
7, 8, 9వ తేదీల్లో భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరు కాబోతున్న ఈ మూడు రోజుల శిక్షణలో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, మార్క్సిజం, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర వంటి పలు అంశాలపై మేధావులు, నాయకులు విశ్లేషిస్తారన్నారు. నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also: రూ.32 లక్షల జాబ్ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!
Follow Us On : WhatsApp

