కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను (Venkatapur Assigned Land) ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (Takallapalli Srinivas Rao) డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వెంకటాపూర్ గ్రామ రైతులు, పేదలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదల అసైన్డ్ భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వాటిని అధికారులు రద్దు చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
వెంకటాపూర్ అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్న భూ కబ్జాదారులను నుండి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అసైన్డ్ భూమిని తిరిగి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్న భూ కబ్జా దారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటాపూర్ లో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా నాయకులు ఎదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి తదితరులు పాల్గొన్నారు.

