కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఖమ్మం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) తెలిపారు. హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమ ప్రాంతం వరకు కాన్వాయ్ (Convoy) రిహార్సల్స్ను నిర్వహించారు. హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై ఖమ్మం (Khammam) టౌన్ పరిధిలోని సప్తపధి ఫంక్షన్ హాల్లో, రూరల్ డివిజన్ పరిధిలో బ్రీఫింగ్ నిర్వహించి పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటూ సీపీ సూచించారు.
మద్దులపల్లి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గం, సభ వేదిక ప్రాంతాల పరిసరాలు, అలాగే రూట్ బందోబస్త్ విధులు నిర్వహించే సిబ్బంది కాన్వాయ్ వచ్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విధులు నిర్వహించే సిబ్బంది సమయస్పూర్తితో, క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమానికి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


