కలం, కరీంనగర్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 50వ డివిజన్ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ బోయిన్ పల్లి ప్రవీణ్ కుమార్ (Corporator Praveen) స్వయంగా డివిజన్ ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేసి, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బోయిన్ పల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల జల వనరులు, పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రజలంతా మట్టి వినాయకులను పూజించి, పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల వైపు మొగ్గు చూపాలని, సంప్రదాయబద్ధంగా పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కాలనీవాసులు, డివిజన్ ప్రముఖులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి విగ్రహాలను స్వీకరించారు.

