కలం, నిర్మల్ : రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీవాణి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంతో పాటు బైంసా, ఖానాపూర్ కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 1,338 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో 6 సివిల్, 1,332 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
నిర్మల్ లో 4 బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.2,02,000, 40 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.4,37,805.39, బైంసాలో 10 బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.13,86,350, ఖానాపూర్లో 11 బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.11,15,000 చెల్లింపులు జరిగినట్లు వివరించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ లు మంచి వేదికగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్, న్యాయవాదులు పాల్గొన్నారు.

