కలం, వనపర్తి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై (Tudi Megha Reddy) బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేను విమర్శించే ముందు తమ నాయకుల గత చరిత్రను గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. బుధవారం వనపర్తి (Wanaparthy) డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గిరిజన సమాజ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని పెద్దగూడెం తండా సర్పంచ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాల్యా నాయక్, వనపర్తి మండల అధ్యక్షుడు రవి నాయక్, అంకాయపల్లి సర్పంచ్ ఆంజనేయులు నాయక్ తెలిపారు. ఎమ్మెల్యేపై మరోసారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
కమీషన్లకు కక్కుర్తిపడి పనులు కట్టబెట్టిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గిరిజన సమాజాన్ని గత పాలకులకు తాకట్టు పెట్టిన రాజకీయాలు ఎవరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆరోపణలు చేసే ముందు బీఆర్ఎస్ నాయకులు తమ గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో సర్పంచ్ల పేరుతో రూ.60 లక్షలు కాజేశారనే ఆరోపణలపై ముందుగా కృష్ణానాయక్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో గిరిజనుల కోసం కేటాయించిన ఎస్టీ నిధులు ఎలా ఖర్చయ్యాయో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు లెక్క చెప్పాలని సవాల్ విసిరారు.
పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రస్తుతం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకుల రాజకీయ వైఖరి ప్రజల ముందు బయటపడిందని విమర్శించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే ప్రజలు ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మేఘారెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
కమీషన్ల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరో ప్రజలకు తెలుసని, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే ముందు తమ గతాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. గిరిజనుల కోసం పనిచేస్తున్న నాయకుడిపై బురదజల్లే ప్రయత్నాలను సహించబోమని, ఇకపై ప్రతి ఆరోపణకు అదే స్థాయిలో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాల్యా నాయక్, అంకాయపల్లి తండా సర్పంచ్ ఆంజనేయులు నాయక్, వనపర్తి మండల అధ్యక్షుడు రవి నాయక్, చిగురుచెట్టు తండా మాజీ సర్పంచ్ రాధాకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

