కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారులందరికి న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కే.కేశవరావు (K.Keshava Rao) స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ఏర్పాటైన కమిటీ సచివాలయంలో గురువారం అఖిల పక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను రికార్డు చేసినట్లు తెలిపారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులు, ఉద్యమకారుల సంఘాలను మళ్లీ కలుస్తామని తెలిపారు. ఉద్యమకారులను, కొన్ని ఉద్యమ జేఏసీ ప్రతినిధులను పిలిచి మాట్లాడతామన్నారు. విద్యార్థులతో, ఉద్యమకారుల సంఘాలతో అనుబంధం ఉన్నవారిని మళ్లీ కలుస్తామని తెలిపారు. తొలి, మలి దశ ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఉద్యమకారులందరినీ పిలిచి మాట్లాడుతామన్నారు.
ఉద్యమ జేఏసీలనూ కలుస్తాం: ఎమ్మెల్సీ కోదండరాం
“ఉద్యమం సమయంలో మా జీవితంలో యవ్వనం పోయింది.. మమ్మల్ని ఆదుకోవాలి..” అంటూ ఉద్యమకారులు తనకు విజ్ఞప్తి చేశారని ఎమ్మెల్సీ కోదండరాం మీడియాకు వివరించారు. ఉద్యమం సమయంలో తాను పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉంటే చాలామంది వివిధ ఉద్యమ జేఏసీల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వారినందరినీ కలుస్తామన్నారు. అన్ని యూనివర్సిటీల్లోని జేఏసీ ప్రతినిధులతోనూ సమావేశమవుతామన్నారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి జేఏసీ, యూనివర్సిటీ జేఏసీలను సంప్రదిస్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఉద్యమకారులను గుర్తిస్తామని పేర్కొన్నారు.

