కలం, మఖ్తల్ : మఖ్తల్ (Makthal) అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari), జిల్లా పరిశీలకులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటరు సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన అత్యంత ముఖ్యమైన హక్కు అని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు అందించే ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మఖ్తల్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఓటరు సవరణ ఫారాలను సమర్పించకపోతే ముసాయిదా జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సకాలంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్లినా ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్గదర్శకాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో మంత్రి ఓటు హక్కు పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

