కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన వివాదం (Congress-BJP Clash) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు బీజేపీ శ్రేణులు వెళ్లడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు భువనగిరి బైపాస్లోని బీజేపీ కార్యాలయం వైపు తరలివచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురెదురుగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరస్పరం దాడులకు దిగిన ఇరువర్గాలు.. అనంతరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఇరువర్గాల నాయకులను సముదాయించారు. బీజేపీ శ్రేణులను పార్టీ కార్యాలయంలోకి పంపించి, రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భువనగిరిలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

