కలం, నిర్మల్: హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నివాసంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మంగళవారం ఆందోళన (BJP Protest) చేపట్టారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ బీజేపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే.. పార్టీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. బీజేపీ నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని దాడులు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని తెలిపారు.

