కలం, జోగులాంబ గద్వాల: ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Collector Rizwan Basha Shaikh) ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడీఓసీ సమావేశపు మందిరంలో అదనపు కలెక్టరు మధుమోహన్ తో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 41 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి సీఎం ప్రజావాణికి మొత్తం ఇప్పటి వరకు జిల్లా నుంచి 244 దరఖాస్తులను ఇవ్వగా.. ఇంకా 57 ఆర్జీలను పరిష్కరించాల్సి ఉందన్నారు.
మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమంను నిర్వహిస్తున్నందున సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులందరూ తప్పకుండా హాజరై తమ శాఖల పరిధిలో వచ్చిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరుకావాలని, అలసత్వం చూపే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

