కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) తెలిపారు. శనివారం తెలంగాణ చౌరస్తా సమీపంలోని శ్రీ గణేష్ భవన్లో జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియతో కలిసి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు.
మట్టి గణపతి ఏర్పాటు చేయడం ద్వారా గణేష్ ఉత్సవ సమితి ప్రజలకు మంచి సందేశాన్ని అందించిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. 5 అడుగుల లోపు విగ్రహాల నిమజ్జనానికి మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో మూడు కృత్రిమ కుంటలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పన్నపల్లి సమీపంలో మయూరి పార్క్ ఎదురుగా గంగోస్కుంట వద్ద రెండు, పంచవటి పాఠశాల సమీపంలో పార్క్ వద్ద ఒక కృత్రిమ కుంటను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
బీచుపల్లిలో నిమజ్జన ఏర్పాట్లు..
పెద్ద గణపతి విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో చర్చించినట్లు చెప్పారు. బీచుపల్లి వద్ద నిమజ్జనానికి అవసరమైన నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గద్వాల కలెక్టర్తో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే గణేష్ ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
గణేష్ ఉత్సవ సమితి ప్రస్తావించిన సమస్యలను తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, కార్యదర్శి ఎం.బాలయ్య, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, వి.హెచ్.పి. నగర అధ్యక్షుడు రెబ్బ విఘ్నేష్, సభ్యులు చేపల హనుమంతు, రాములు, మాల్యాద్రి, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.

