కలం, కరీంనగర్ బ్యూరో : విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్ పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇన్ పుట్ డీలర్లకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లొమా కోర్సు DAESI శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, రైతులు ఎక్కువగా డీలర్లని నమ్ముతారని, అందువల్ల రైతుల ద్వారా డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గాను ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రభుత్వపరమైన అవసరాలు, సూచనలు రైతుల వరకు చేరేందుకు డీలర్లు వారధిలా నిలవాలన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను పరిస్థితులను వివరించాలని తెలిపారు. రైతు వేదికల్లో జరిగే సమావేశాలకు హాజరై ఎరువుల గురించిన అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతు ఎంత ముఖ్యమో డీలర్లు అంతే ప్రధానమని అన్నారు. డీలర్లను రైతులు నమ్ముతారని, వారి సలహాలను రైతులు తప్పనిసరిగా పాటిస్తారని తెలిపారు. విడిగా విత్తనాలు, గడువు తేదీ ముగిసిన ఎరువులు, విత్తనాలు, నకిలీ పురుగు మందులు విక్రయించరాదని అన్నారు. రైతుకు లాభం చేకూర్చే సూచనలు ఇస్తూ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన 3 6 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ పిడి చత్రు నాయక్ పాల్గొన్నారు.

