పశు సంరక్షణ మనందరి బాధ్యత: కలెక్టర్ చంద్రశేఖర్

కలం, నల్లగొండ బ్యూరో: నేరుగా ఆదాయాన్ని సృష్టించే పశు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ (Collector Badugu Chandrasekhar) అన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ (Nalgonda) జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాతిత్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పశువుల ద్వారా పర్యావరణ సమతుల్యం కాపాడగలుగుతామని కలెక్టర్ అన్నారు. సమాజం అభివృద్ధి చెందేందుకు పశువులు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాంటి పశుసంపద జాతికి చాలా ముఖ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాంసం తినే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని లైవ్ స్టాక్ నాణ్యత కూడా చాలా ముఖ్యమని సూచించారు. లైవ్ స్టాక్‌ను మనమే నిర్వహించుకోవాలని, అయితే జిల్లాలో పశు సంతతికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మే రెండవ వారంలో జిల్లాలో పెంపుడు కుక్కల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పశువుల ఆసుపత్రులు, సబ్ సెంటర్లలో సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట టాయిలెట్లు నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 35 వేలకు పైగా కుక్కల జనాభా ఉండగా, ఒకే ఒక్క ఏబీసీ కేంద్రం ఉందన్నారు. ఇందుకు గాను మున్సిపాలిటీలలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను చూడాలని ఆర్డీవో అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు సైతం ఇందుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా పశు వైద్యశాలలో ల్యాబ్‌లు, టాయిలెట్లు, సౌకర్యాల అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్‌ను ఆదేశించారు. పశువుల ఇన్సూరెన్స్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీవీ ఏ హెచ్.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సహాయ సంచాలకులు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పశుసంవర్ధక శాఖ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>