కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) చేపట్టిన నిరసనలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. సీజేపీ ఆందోళన సెగలు హైదరాబాద్ కు తాకాయి. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా హైదరాబాద్ (Hyderabad) లో కాక్రోజ్ జనతా పార్టీ నిరసనలకు మద్ధతుగా విద్యార్థులు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నిరసన వ్యక్తం చేసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నీట్ పరీక్షల వివాదంలో కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన మరింత ఉధృతం కాకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
లోక్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

