కలం, వెబ్డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఏపీలో జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంపై స్పందించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని 13 వేల మంది గిరిజన విద్యార్థులు థింసా నృత్యాన్ని (Dhimsa Dance) ప్రదర్శించి మోదీకి స్వాగతం పలికారు. ఈ సామూహిక ప్రదర్శన గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
దీనికి రిప్లై ఇస్తూ కాక్రోచ్ పార్టీ మరో పోస్టు చేసింది. ఈ కార్యక్రమం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నిర్వహిస్తున్నారా? అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. విద్యార్థులతో స్వాగతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ప్రధాని మోదీ ఈ ఏర్పాట్లపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో మోదీ షెడ్యూల్ కంటే మరో అరగంట ఎక్కువ సమయం కేటాయించారు.

